దీక్షలతో ఉక్కు రాదు.. తుక్కు రాదు

SMTV Desk 2018-06-22 17:48:19  JC DIWAKAR REDDY, KADAPA MP, CM RAMESH, KADAPA

కడప, జూన్ 22 : దీక్షలతో ఉక్కు.. తుక్కు ఏదీ రాదని.. ప్రధాని మోదీ ఏమీ చేయరని మూడేళ్ల క్రితమే సీఎం చంద్రబాబుకు చెప్పానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపాక జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రమేష్ దీక్షలో నిజాయితీ లేదని, మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని, రాష్ట్రానికి ప్రధాని ఏమీ చేయరని విమర్శించారు. గుజరాత్‌ సీఎంగా ఉండగా ఒక వర్గాన్ని హత్యలు చేసిన మోదీ.. ప్రధానిగా ఉండటానికి అర్హత లేదన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా ఉన్నప్పుడు వారిపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే వారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హయాంలో పోలీసులన్నా, లాఠీలన్నా ప్రజల్లో భయం లేకుండా పోయిందని అన్నారు. ఇదిలావుండగా జేసీ వ్యాఖ్యలు విన్న తెలుగుదేశం నేతలు ఖంగుతిన్నారు. సొంత పార్టీ నేతలపైనే జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, తెలుగు తమ్ముళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు.