హైదరాబాద్, జూన్ 21 : సౌరభ్ గంగూలీ.. మహేంద్ర సింగ్ ధోనీ.. వీరిద్దరూ ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్లెన్లు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ 183 ఏంటి అనుకుంటున్నారా..!. జెర్సీ నెంబర్ల, లేకపోతే గెలిపించిన మ్యాచ్ ల టీమిండియా తరఫున 183 మ్యాచ్లకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించారా అంటే అదీ కాదు. మరేంటి అనుకుంటున్నారా..! అయితే ఇది చదివేయండి. కోహ్లీ, ధోనీ, గంగూలీ ఈ ముగ్గురికి 183కి సంబంధం ఏంటంటే. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఈ ముగ్గురి వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 కావడం విశేషం. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించడం మరో విశేషం. >> సౌరభ్ గంగూలీ: 1999లో ప్రపంచకప్లో గంగూలీ తన వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేశాడు. టోర్నీలో భాగంగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గంగూలీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. >> మహేంద్ర సింగ్ ధోనీ: 2005లో ధోనీ 183 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన 7 వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డేలో ధోనీ తన వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. >> విరాట్ కోహ్లీ: భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 2012లో ఈ క్లబ్లో చేరాడు. ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరును సాధించాడు. 330 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.