ఆస్ట్రేలియా, జూన్ 20 : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు రెచ్చిపోయి వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ జట్టు ఆట తీరుపై ఆ దేశపు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన డే- నైట్ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పేన్ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం షేన్వార్న్.."నిద్ర లేవండి, ఇంగ్లండ్ స్కోరు ఒకసారి చూడండి. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్ ద హెల్ అంటూ"ట్వీట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ కూడా ట్విటర్ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 206 పరుగులతో ఓడిన ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.