పశ్చిమగోదావరిలో దారుణం..

SMTV Desk 2018-06-20 12:39:44  polavaram lovers murder, young person suicide, west godavari, jangareddy gudem

పోలవరం, జూన్ 20 : పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రేమోన్మాది దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిదనే కారణంగా యువతిని గొంతు కోసి హత్య చేసిన యువకుడు.. తర్వాత తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని టి.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంకు చెందిన అళ్ల కిరణ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వస్ర్త దుకాణంలో పనిచేస్తున్న దొండపూడి లహరితో కొంతకాలం క్రితం అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో అప్పటి నుండి ప్రేమ పేరుతో అతడు లహరిని ఇబ్బంది పెట్టాడు. అయితే ఆమె ఎప్పటికప్పుడు కిరణ్‌ ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరానికి చెందిన సతీశ్‌ అనే యువకుడితో లహరికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగనుండగా.. మంగళవారం రాత్రి కిరణ్‌ లహరి ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఆమె తిరస్కరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పారిపోయాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.