వాషింగ్టన్, జూన్ 15 : అఫ్గానిస్థాన్లోని తూర్పు కునార్ ప్రావిన్స్లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్ తాలిబన్ చీఫ్.. మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్గాన్లో సీనియర్ ఉగ్రవాదులే లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేసినట్లు యూఎస్ మిలిటరీ గురువారం ప్రకటించింది. ఈ దాడిలో ఉగ్రవాది నాయకుడు హతమైనట్లు.. అయితే ఆ ఉగ్రవాది పేరును మాత్రం అమెరికా దళాలు వెల్లడించలేదు. కాగా యూఎస్ జరిపిన దాడిలో పాకిస్థాన్ తాలిబన్ అధిపతి మౌలానా ఫజ్లుల్లా, మరో నలుగురు తహ్రీక్ ఇ తాలిబన్ కమాండర్లు హతమైనట్లు ఆఫ్గాన్లోని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, అతడి కమాండర్లు ఇఫ్తార్ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్లోని తాలిబన్ చీఫ్గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు తెగబడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. అంతేగాక.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాపై 2012లో దాడి చేసింది కూడా ఫజ్లుల్లా, అతడి అనుచరుడే అని అమెరికా వెల్లడించింది.