ఢిల్లీ, జూన్ 15 : తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపిన తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పంటలకు మద్దతు ధర, కొత్త జోనల్ విధానం, ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన, దిల్లీలోని ఏపీభవన్ తెలంగాణకు కేటాయింపు తదితర 68 అంశాలను ఆయన ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధానితో సమావేశం కోసం కేసీఆర్ గురువారమే ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు కేశవరావు, జితేందర్రెడ్డి, సంతోష్కుమార్, బండా ప్రకాశ్ తదితరులున్నారు. ఢిల్లీకు చేరుకున్న వెంటనే ఆయన టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై ప్రధాని దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని ఏపీభవన్ నిజాం హయాం నాటిది అయినందున దానిపై పూర్తి అధికారం తెలంగాణకే ఇవ్వాలని సీఎం కోరనున్నారు.