హైదరాబాద్, జూన్ 14 : టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ నేతల దిమ్మ తిరుగుతోంది అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులకు కన్నీళ్లే మిగిలాయని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీరు అందడంతో వారి ముఖాలు వికసించాయని ఆయన తెలిపారు. సిరిసిల్ల మండలం సర్ధాపూర్లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో రూ.30 కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ డిగ్రీ కాలేజీ భవనానికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివా్సరెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రైతుబీమాపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. "రైతులకు అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు చారిత్రాత్మకమైనవి. రాష్ట్రంలో ప్రతి కులవృత్తికి పూర్వ వైభవం వచ్చేలా అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించం. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేలా 38 లక్షల ఎకరాలకు మూడు పంటలకు నీరందించేందుకు సిద్ధమవుతుంది. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చి దిద్దుతున్నా౦" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.