శ్రీనగర్, జూలై 12 : ఓ బస్సు డ్రైవర్ సాహసంతో 51 మంది అమర్ నాథ్ యాత్రికులను ఉగ్రవాదుల నుంచి కాపాడగలిగాడు. గుజరాత్ లోని వల్సాడ్ పట్టణానికి చెందిన ఓం ట్రావెల్స్ బస్సు డ్రైవర్ షేక్ సలీం గపూర్ ఇప్పుడు అందరిని ఆదుకున్న దేవుడంటున్నారు. బుల్లెట్ల వర్షంలోనూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలతో ముందడుగు వేసిన సలీంకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విషయంలోకి వెళితే... అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారు అక్కడి ఉగ్రదాడులకు బలయ్యారు. మరి కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన మహారాష్ట్ర వాసి భాగ్యమాణి మాట్లాడుతూ తనతోపాటే వచ్చిన తన మరదలు నిర్మల ఈ ఘటనలో చనిపోయిందని రోదిస్తూ చెప్పారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందని ఆ బస్సులో ఉన్నవారెవరు ఊహించనేలేదని ఆమె తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల మధ్య బస్సును వేగంగా నడుపుతుండగా, బస్సు యజమాని హర్ష్ దేశాయ్ శరీరంపై మూడు చోట్ల తూటాలు తగిలాయని ఆమె తెలిపింది. సలీం మాత్రం తూటాల బారిన పడకుండా తప్పించుకుని సైనికులు కనిపించేంత వరకు బస్సును పరిగెత్తించాడని తెలిపారు. భారీకాల్పుల మధ్య బస్సును దూరంగా తీసుకెళ్లగలిగామని సలీం ఆ బీతావహ క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు బస్సులోకి రాకుండా తలుపులను లోపల నుంచి లాక్ చేసినట్టు ఆయన వివరించారు. సలీం బస్సులో ఉన్నవారందరినీ కాపాడకపోవచ్చు. కానీ 51 మందిని రక్షించిన ఘనత దక్కించుకున్నాడు. అందురు కూడా సలీం చేసిన సాహసానికి హర్షం వ్యక్తం చేశారు.