తాజ్‌మహల్‌ కాదు.. రాజ్ మహల్ అని పెట్టండి..

SMTV Desk 2018-06-11 17:00:31   Surendra Singh BJP MLA, Surendra Singh about taj mahal, up mla, lucknow

లఖ్‌నవూ, జూన్ 11 : బీజేపీ నేతలకు వారి అధిష్టానం ఎంత చెప్పిన నేతల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును, ప్రతిష్టను దిగజారుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ తాజాగా తాజ్‌మహల్‌పై చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. "మొఘలుల పాలనా కాలం ముగిసిపోయిన తర్వాత వారి పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు, చారిత్రక కట్టడాల పేర్లను మార్చాలి. ఇందులో భాగంగా తాజ్‌మహల్‌ పేరును రామ్‌ మహల్‌, కృష్ణ మహల్‌ లేదా శివాజీ మహల్‌గా నామకరణం చేయాలి" అంటూ సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సురేంద్ర సింగ్ ప్రభుత్వోద్యోగులు ఒకవేళ లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టండంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని, పొరపాటున నోరుజారి మీడియాకు మసాలా ఇవ్వద్దని ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలం కిందట తమ నేతలకు సూచించారు. అయితే ఆ మరుసటి రోజే సురేంద్ర సింగ్‌... పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్పణఖగానూ, మోదీని రామావతారంగానూ అభివర్ణించి వార్తల్లో నిలిచారు.