కౌలలంపూర్, జూన్ 10 : ఆసియాకప్ మహిళల టీ20 టైటిల్ను బంగ్లాదేశ్ జట్టు సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ మహిళల జట్టుకు బంగ్లాదేశ్ జట్టు షాకిచ్చింది. ఆదివారం భారత్తో జరిగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 112పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(56; 42బంతుల్లో 7×4) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ విఫలమయ్యారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్ బ్యాట్స్ఉమెన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో పోరు రసవత్తరంగా సాగింది. కానీ రుమానా అహ్మద్ (23; 22బంతుల్లో 1×4) చివరి వరకూ నిలిచి బంగ్లాను విజయతీరాలకు చేర్చింది. దీంతో ఈసారి ఆసియాకప్ బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. లీగ్ మ్యాచ్లో సైతం భారత్ను ఓడించిన బంగ్లాదేశ్ మహిళలు అదే ప్రదర్శనను చివరి సమరంలో సైతం పునరావృతం చేసి టైటిల్ నెగ్గారు. ఫలితంగా తొలిసారి బంగ్లాదేశ్ ఆసియాకప్ను సొంతం చేసుకుంది.