విశాఖపట్నం, జూన్ 9 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని.. విశాఖ గ్రామీణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు ఆగ్రహించారు. శనివారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో నాపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయి. అనధికారికంగా రోజుకు రూ.6లక్షల ఆదాయం పొందుతున్నట్లు పవన్ నాపై ఆరోపణ చేశారు. దీన్ని 15 రోజుల్లోగా ఆధారాలతో నిరూపించాలి. అలా కానీ పక్షంలో క్షమాపణ చెప్పాలి లేకపోతే పవన్పై పరువు నష్టం దావా వేస్తాను" అని ఆయన హెచ్చరించారు.