ముంబై, జూన్ 9 : నిన్న మొన్నటి వరకు భానుడి సెగతో మండిపోయిన ముంబై ఇప్పడు భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది. శనివారం ముంబై నగరాన్ని భీకరమైన వర్షాలు ముంచెత్తాయి. దాంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 32 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 3 విమానాలను రద్దు చేశారు. అటు లోకల్ రైళ్లు 10-15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప వీధుల్లోకి రాకూడదని స్పష్టం చేశారు. వారం రోజలు పాటు భారీ వర్ష సూచన ఉన్న కారణంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. దీంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముంబయి మున్సిపల్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారులకు వారాంతపు సెలవులను రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు.