ఢిల్లీ, జూన్ 8 : భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి , మైనపు విగ్రహం రెండు రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కాగా ఈ విగ్రహం కాస్త దెబ్బ తిన్నట్లు సమాచారం. బుధవారం(జూన్ 6న) ఉదయం మ్యూజియం నిర్వాహకులు కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు కోహ్లీ విగ్రహంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులు అత్యుత్సాహం కారణంగా విగ్రహం కుడి చెవి భాగం కొంచం విరిగిపోయింది. వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. వీలైనంత త్వరగా దాన్ని తయారు చేసి పంపాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మూడో భారత క్రికెటర్ విగ్రహం కోహ్లీది. గతంలో కపిల్ దేవ్, సచిన్ తెందుల్కర్ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఆవిష్కరించిన రోజే కోహ్లీ విగ్రహం ధ్వంసం కావడంతో అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు.