ముంబై, జూన్ 7 : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అందాల తార మాధురీ దీక్షిత్ దంపతులతో సమావేశమయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మద్దతు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ ఇతర ముఖ్య నేతలతో కలిసి అమిత్షా బుధవారం ముంబైలో మాధురీ దీక్షిత్తో 40 నిమిషాలపాటు భేటి అయ్యారు. నాలుగేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను అమిత్షా పుస్తక రూపంలో మాధురీ దీక్షిత్కు అందజేశారు. మాధురి భర్త, ప్రముఖ సర్జన్ శ్రీరాం నేనె కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు రతన్ టాటాను కూడా అమిత్షా కలిశారు. లతా మంగేష్కర్ అనారోగ్యంగా ఉండటంతో ఆమెతో భేటీని వాయిదా వేసుకున్నారు. 4,000 మంది బీజేపీ నేతలు లక్ష మంది వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై బీజేపీకి మద్దతిచ్చేట్లు ఒప్పించే ఈ కార్యక్రమానికి ‘సంపర్క్ కే సమర్థన్’గా పేరు పెట్టారు. బీజేపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సంపర్క్ ఫర్ సమర్థన్ అనే ప్రచార కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ఒక లక్ష మందిని కలుసుకోవాలనేది లక్ష్యం. ఇందులో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరిస్తారు. ఎన్నికలకు ఏడాదే సమయం ఉండటంతో ప్రజల్లోకి విస్తృతంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి వెళ్లాలని ఆ పార్టీ ఈ విధమైన కార్యక్రమానికి రచన చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.