ఢిల్లీ, జూన్ 6 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. భారత్ నుండి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో స్థానం సంపాదించుకొన్నారు. ఈ ఏడాది టాప్-100 జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటించింది. 24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. గత ఏడాది 22 మిలియన్ డాలర్ల ఆదాయంతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాడు. ఈ ఏడాది టాప్-100. 4 మిలియన్ల డాలర్లను జీతంగా అందుకుంటున్న కోహ్లీ మిగతా 20 మిలియన్ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు. అమెరికాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయడ్ మేవెదర్ 285 మిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ(111 మిలియన్ డాలర్లు), పోర్చుగల్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గత ఏడేళ్లల్లో ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఫ్లాయడ్ నాలుగోసారి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.