ఇంగ్లాండ్, జూన్ 5 : సుదీర్ఘ కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని.. ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటం ఎంతో కలిసొచ్చిందని, తనలో ఆత్మ విశ్వాసం నింపిందని అంటున్నాడు ఇంగ్లాండ్ ఆటగాడు బట్లర్. ఐపీఎల్ 11వ సీజన్లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో అతడు వరుసగా ఐదు అర్ధశతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శన చూసే పాకిస్థాన్తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ బోర్డు బట్లర్కు అవకాశం కల్పించింది. తాజాగా బట్లర్ మాట్లాడుతూ..."ఐపీఎల్లో ఆడేందుకు కొన్ని వారాల పాటు భారత్లో ఉన్నాను. ఈ సీజన్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కొన్ని మ్యాచ్ల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాను. అంతేకాదు ఈ సీజన్ నాకు ఎంతో కలిసొచ్చింది. ఐపీఎల్లో నా ప్రదర్శన చూసే ఇంగ్లాండ్ టెస్టు జట్టులో చాలా కాలం తర్వాత చోటు దక్కింది. టీ20లకు, టెస్టులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక టీ20 ఆడిన అనంతరం మరో మ్యాచ్కు తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ముందు మ్యాచ్లో ఎలా ఆడామన్న దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ, టెస్టుల్లో అలా కాదు. ముందే ఔటైతే దాని గురించి ఐదు రోజుల పాటు ఆలోచిస్తూనే ఉండాలి" అని బట్లర్ అన్నాడు. పాకిస్తాన్తో లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో బట్లర్ 67 పరుగులతో మెరవగా, లీడ్స్లో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 80 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ సమం చేసుకుంది.