ముంబై, జూన్ 5 : టీమిండియా ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి మరోసారి మాయ చేశాడు. వేలాది మంది అభిమానుల మధ్య ఛెత్రి రెండు గోల్స్ చేయడంతో.. ఇంటర్కాంటినెంటల్ కప్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-0 తేడాతో కెన్యాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వందో మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ సునీల్ చెత్రికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో అతను చెలరేగిపోయాడు. తొలి అర్ధభాగం ముగిసేదాకా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాని తర్వాత వర్షం పడడంతో మ్యాచ్కు కొద్దిగా అంతరాయం కలిగింది. తిరిగి మ్యాచ్ మొదలైన కొంతసేపటికే ఛెత్రి పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఆ తర్వాత మూడో నిమిషాల్లోపే జేజె లాల్పెహ్లువా (71వ నిమిషంలో) గోల్ చేసి భారత్కు రెట్టింపు ఆనందాన్ని అందించాడు. కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఛెత్రి (92వ నిమిషంలో) గోల్ కొట్టాడు. వందో అంతర్జాతీయ మ్యాచ్లో ఛెత్రి అరుదైన రికార్డును నెలకొల్పాడు. మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన అతను తన ఖాతాలో అరుదైన రికార్డు చేర్చుకున్నాడు. 61 గోల్స్తో ఉన్న ఛెత్రి... ప్రస్తుతం ఫుట్బాల్ ఆడుతూ అత్యధిక గోల్స్ చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ ముందు వరకూ 59 గోల్స్తో డేవిడ్ విల్లా (స్పెయిన్)తో సమానంగా ఉన్న ఛెత్రి... ఈ మ్యాచ్లో రెండు గోల్స్తో అతణ్ని అధిగమించాడు. ఛెత్రి కన్నా ముందు రొనాల్డో (81), మెస్సీ (64) మాత్రమే ముందున్నారు.