న్యూఢిల్లీ, జూన్ 4 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడమే ప్రధాన అంశం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం అన్నారు. మోదీ ప్రభుత్వం అవాస్తవాలను కప్పిపుచ్చుతున్న తీరును విపక్షాలు ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ చేసిన వాగ్ధానాలు ఎంతమేర అమలయ్యాయనే దానిపైనే 2019 లోక్సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పనితీరుపై జరిగిన తరహాలోనే తదుపరి ఎన్నికలు మోదీ పనితీరుకు రెఫరెండంలా ఉంటాయని తెలిపారు. "బీజేపీ చెబుతున్న అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం విపక్షాలుగా మా బాధ్యత. మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్లలో మాదిరిగా కాకుండా కర్ణాటకలో బీజేపీయేతర సర్కార్ ఏర్పాటుకు పార్టీ వేగంగా పావులు కదిపింది. కర్ణాటకలో జేడీఎస్కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వడంతో పాటు బీజేపీని నిలువరించేందుకు పార్టీ వేగంగా స్పందించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో జతకడుతుంది. బిహార్లో ఆర్జేడీతో, జార్ఖండ్లో జార్ఖండ్ వికాస్ మోర్చాతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు ఉంటుంది. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులకూ అవకాశం ఉంటుంది" అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.