లాగోస్, జూన్ 3 : ఇప్పుడు మారుతున్న సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళా అందరూ సామాజిక మాధ్యమాల్లో బీజీ అయిపోతున్నారు. ఉదయం లేవగానే వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ ఎదో ఒకటి చూడకపోతే ఆ రోజు గడవదు. డేటా బ్యాలన్స్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చుట్టూ ఉన్న భావన కలుగుతుంది. అడ్డూ అదుపు లేకుండా సోషల్ మీడియాలో విహరించొచ్చు. ఇష్టమొచ్చినట్లు షేరింగులు, లైకింగులు, పోస్టింగులు చేయొచ్చు. అడిగే వాళ్లే ఉండరు. దానికి అదనంగా డబ్బు కట్టాల్సిన పనే లేదు. కానీ ఓ దేశం ఇక సామాజిక మాధ్యమాలు ముట్టుకుంటే జరిమానా కట్టాలి అంటుంది. ఉగాండా దేశం ఆ ప్రజలకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకొంది. అక్కడి ప్రజలు వాట్సాప్ సహా ఫేస్బుక్, ట్విటర్ లాంటి ఏ సామాజిక మాధ్యమాన్ని ముట్టుకున్నా జేబుకు చిల్లు పడుతుంది. వాట్సాప్, సోషల్ మీడియా వాడకంపై ఆ దేశం పన్ను విధించింది. వాటిలోకి తొంగి చూస్తే చాలు.. రోజుకు రూ.3.55 (ఉగాండాలో 200 షిల్లింగ్స్) చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది.