హైదరాబాద్, జూన్ 2 : ఐపీఎల్-11 మే 27 తో ముగిసింది. ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు చేరాయి. సిక్స్ లు, ఫోర్లు, అద్భుతమైన క్యాచ్ లు, బౌలింగ్ మెరుపులు, అబ్బో ఈ ఏడాది మ్యాచ్లు చాలా ఉత్కంఠగా సాగాయి. ఈ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఓ అనూహ్య ఘనత సాధించాడు. టీ20లో పదివేలకు పైగా పరుగులిచ్చిన తొలి బౌలర్గా నిలిచాడు. అతడి కెరీర్లో దాదాపు 19 జట్ల తరఫున 391 మ్యాచ్లు ఆడాడు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్-11 సీజన్లో మళ్లీ చెన్నై తరఫున ఆడిన బ్రావో తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. బౌలింగ్లో ఎక్కువ పరుగులే ఇచ్చినా కొన్ని మ్యాచుల్లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బంతులు విసిరాడు. టీ20ల్లో 427 వికెట్లు తీసిన బ్రావో 1254.2 ఓవర్లు వేసి 10,000కు పైగా పరుగులు ఇచ్చాడు. ఎకానమీ 8.20. ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నా బ్రావో మాత్రం దూసుకుపోతున్నాడు.