ముంబై, జూన్ 2 : ఐపీఎల్ -11 హంగామా ముగిసిపోయిందని అనుకుంటున్న సమయంలో ప్రస్తుతం బెట్టింగ్ ఉదంతం కలకలం రేపుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్ చిక్కుకొన్న విషయం తెలిసిందే. ఉదంతంపై ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఈ విషయం పోలీసుల పరిధిలో ఉంది. మేం చేసేదేమీ లేదు. బీసీసీఐ, ఐసీసీకి అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. పోలీసులతో అవి సమన్వయంతో పనిచేస్తాయి" అని శుక్లా అన్నారు. ఐపీఎల్ బెట్టింగ్లో తాను రూ.2.75 కోట్లు నష్టపోయానని పోలీసుల విచారణలో అర్బాజ్ఖాన్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పూర్తైన వెంటనే డిప్యూటీ కమిషనర్ వివరాలను బహిర్గతం చేస్తారని ఠానె పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు. అంతకుముందే పోలీసులు గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన బుకీ సోనూ జలన్ను పట్టుకున్నారు. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్ను ప్రశ్నించారు