బెంగళూరు, జూన్ 1 : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడబోవు మంత్రివర్గంపై స్పష్టత వచ్చింది. మంత్రివర్గ కూర్పుపై రెండు పార్టీల మధ్య ఈ రోజు జరిగిన కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ సూచనలకు అనుగుణంగా నేతలు విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సీఎం కుమారస్వామి తెలిపారు. తమ కూటమి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడుపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. మంత్రి పదవుల కేటాయింపులో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నట్టు కుమారస్వామి వెల్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంతో చొరవ చూపారన్నారు. ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని, ఆ సూచనలకనుగుణంగా కాంగ్రెస్ నేతలు కూడా పదవుల పంపకం అంశంలో ఓ అంగీకారానికి వచ్చారని సీఎం వివరించారు.