ముంబై, మే 30 : భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే ఒక హై వోల్టాజ్ ఉత్కంఠ నడుస్తుంది. కాగా గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ సేన పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పుడు.. ప్రతి భారతీయుడి ఆవేదన వర్ణించలేనిది. అయితే ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్. ఈ విషయాన్ని గబ్బరే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ధావన్ మాట్లాడుతూ... " గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయాం. ఆ తర్వాత మళ్లీ భారత్-పాక్ తలపడేది వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్లోనే. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో పాక్ను ఓడించి... ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి. పాక్పై గెలుపోటముల రికార్డును మెరుగుపరచాలి" అని అభిప్రాయపడ్డాడు. అనంతరం ధోనీ గురించి స్పందిస్తూ..."ప్రపంచకప్లో ధోనీ ఆడటం భారత జట్టుకు ఎంతో కలిసొచ్చే అంశం. ప్రస్తుతం అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో చాలా బాగా ఆడాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకూ ధోనీ ఇదే ఫామ్ను కొనసాగించాలని కోరుకుంటున్న" అని ధావన్ వెల్లడించాడు.