విజయవాడ, మే 29 : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి హోదా అనేది కల మాత్రమే అని కూడా తాను ముందే చెప్పా అని తెలిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. " చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం" అని వ్యాఖ్యానించారు. "ప్రతి వాడు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారు. రేపు నారా లోకేశ్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా.. నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా.. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వడా.. టీడీపీ అనేది చంద్రబాబు సొంతం. ఆయన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు" అని జేసీ పేర్కొన్నారు.