ముంబై, మే 29 : టీమిండియా ఆటగాడు, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అఫ్గానిస్థాన్తో జరిగే చరిత్రాత్మక టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. గత ఏడాది టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్... తన తొలి టెస్టును జూన్లో భారత్తో ఆడనుంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన సాహా.. టోర్నీలో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో సాహా చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన ఫైనల్ కు కూడా దూరమయ్యాడు. సాహాకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. ఇదే విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ బీసీసీఐకి తెలిపింది. జూన్ 14 నుంచి బెంగళూరులో అఫ్గానిస్థాన్తో చరిత్రాత్మక టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో సాహా అఫ్గానిస్థాన్తో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరు వారాల తర్వాత సాహా ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సాహా స్థానంలో దినేశ్ కార్తీక్ లేదా పార్ధివ్ పటేల్ ను తీసుకొని యోచనలో బీసీసీఐ ఉంది.