వరల్డ్-11: పాండ్యా ఔట్.. మహ్మద్‌ షమీ ఇన్

SMTV Desk 2018-05-28 20:20:39  world-11 team, hardik pandya, shami, west indies, icc match

ముంబై, మే 28 : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు నుంచి టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీని ఎంపిక చేశారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్‌ లెగ్‌స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌కు సైతం తుది జట్టులో స్థానం కల్పించారు. గతేడాది హరికేన్‌ బీభత్సంతో కరేబియన్‌ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ధ్వంసమైన మైదానాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఐసీసీ చారిటీ మ్యాచ్‌ నిర్వహిస్తోంది. ఇంగ్లండ్‌, లార్డ్స్‌ వేదికగా మే 31న జరిగే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడనుంది. ఈ వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నాడు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. భారత్‌ నుంచి ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌లు అవకాశం కల్పించగా పాండ్యా దూరమయ్యాడు. ఈ టీ20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్‌ తరపున అఫ్రిది, షోయబ్‌ మాలిక్, బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్, తమీమ్‌ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌లు ఎంపికయ్యారు. వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), షకీబుల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, తిసార పెరీరా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, లూక్‌ రోంచి, మెక్లినగన్‌, అదిల్‌ రషీద్‌, సందీప్‌ లమిచ్చనే