హైదరాబాద్, మే 27 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జోనల్ విధానం అమలుకోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పుపై తీర్మానం ప్రతితో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నాలుగురోజుల్లో ప్రధానితో పాటు కేంద్రమంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో నేడు జోనల్ విధానం సహా వివిధ అంశాలపై ఆమోదం కోసం మంత్రిమండలి భేటీ కానుంది. మంత్రిమండలి కోసం మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు. సాయంత్రం 5 గంటలకు సమావేశాన్ని ముగించాలని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తదితరులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రితో భేటీ మంగళవారం ఉండే వీలుంది. ఈ క్రమంలో ఆయన దంత వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటారని సమాచారం.