కోల్ కతా, జూలై 10 : పేదల జీవితాల్లోకి వచ్చిన మహా పుణ్యమూర్తురాలైన మదర్ థెరిస్సా రోగగ్రస్తులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేశారు. ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించారు. 12 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్న గొప్ప వ్యక్తి ఆమె. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తదుపరి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కలిచి వేసింది. దీంతో 1946 సెప్టెంబర్ 10 లో థెరిస్సా తన సంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తా నుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గురించి తెలియజేశారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివసిస్తూ వారికి సేవ చేయాలి, దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లేనని, ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు. అటు వెంటనే అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చ సాగారు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న మదర్ థెరిస్సా ధరించిన తెల్లటి వస్రానికి, నీలిరంగు అంచు ఉన్న చీరకు మేధో సంపత్తి హక్కులు లభించాయి. ఈ చీరకు మేధో సంపత్తి హక్కులు కల్పించాలంటూ మిషనరీస్ ఆఫ్ చారిటీ 2013లో దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును పరిశీలించిన ట్రెండ్ మార్క్స్ రిజిస్ట్రీ 2016 లో మేధో సంపత్తిగా గుర్తించింది. దీనిపై న్యాయవాది బిస్వజిత్ సర్కార్ మాట్లాడుతూ ఈ అరుదైన గుర్తింపుపై ప్రజల్లో అవహగన కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ యూనిఫాంకు మేధో సంపత్తి హక్కులు లభించడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు.