హైదరాబాద్, మే 26 : అతిలోక సుందరి దివంగత నటి.. శ్రీదేవి మరణం యావత్ సినీ లోకాన్ని కన్నీరు మున్నీరు చేసింది. ఆమె కుటుంబానికి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిలిచింది. ఆమె మరణించి నెలలు గడుస్తున్నా ఆమె జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అక్కినేని నాగార్జున శ్రీదేవి గురించి ప్రస్తావించారు. ఆయన కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో "ఆఫీసర్" సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన నాగార్జున.. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి మరణాన్ని నేను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నా. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు. "గోవిందా గోవిందా" సినిమా షూటింగ్ సమయంలో ఆమెను చాలా దగ్గరగా చూశానని, కెమెరా ముందు ఆమె ఎంతో సరదాగా ఉండేవారని చెప్పారు. వృత్తిపరంగా ఆమె ఏదైనా సాధించగల ఏకైక నటి అన్నారు. శ్రీదేవి మరణం నాలో వ్యక్తిగతంగా మార్పు తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే తాను నటనలో ఉన్నంతకాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని పేర్కొన్నారు.