బెంగళూరు, మే 25 : కర్ణాటక శాసనసభ స్పీకర్గా కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. సభాపతి ఎన్నికకు జరిగిన పోటీలో భాజపా నేత సురేశ్కుమార్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ బోపయ్య ప్రకటించారు. అనంతరం రమేశ్ కుమార్ సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పీకర్ రమేష్ కుమార్ దగ్గరికెళ్లి మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో కుమారస్వామి సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుంది. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటే తప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.