హైదరాబాద్, మే 23 : కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇంటా విషాదం చోటు చేసుకుంది. ఆయన ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్(21) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో భోజనం చేస్తుండగా అతను గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన కుటుంబసభ్యులు ముషీరాబాద్లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నారు. కుమారుడి మృతితో షాక్కు గురైన దత్తాత్రేయ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైష్ణవ్ మృతదేహాన్ని బంధువుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే వైష్ణవ్ ఇక లేడని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడిని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. వైష్ణవ్ హఠాన్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి దత్తాత్రేయను పరామర్శించారు. భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ తదితరులు దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు.