హైదరాబాద్, మే 20 : కుర్ర హీరో నిఖిల్.. దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం "కార్తికేయ". గుప్త నిధుల కాన్సెప్ట్ తో థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించి౦ది. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో రూపొందించినప్పటికీ సూపర్ హిట్స్ చిత్రంలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నిఖిల్ తన పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా "కార్తికేయ" సినిమాకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కార్తికేయ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క "బాహుబలి" చిత్ర౦ మినహాయిస్తే.. సీక్వెల్ సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీక్వెల్ అనగానే మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారని అందుకే అనవసరమైన రిస్క్ జోలికి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో నిఖిల్ అభిమానులు కాస్తంత నిరాశకు గురవ్వడం ఖాయం.