హైదరాబాద్, జూలై 9 : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనంతపురం ఎంపీ జేసీ. దివాకర్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. టికెట్ తీసుకుని స్పైస్జెట్ విమానంలో ఎక్కిన ఆయనపై నిషేదం ఉందని తెలుసుకున్న సిబ్బంది కిందికి దించివేశారు. ఈరోజు ఉదయం విజయవాడ వెళ్లేందుకు ట్రూజెట్ విమాన టికెట్ తీసుకున్న ఆయన, విమనాశ్రయానికి వెళ్లకముందే ట్రూజెట్ మేనేజర్ జేసీకి ఫోన్ చేసి నిషేధం ఉన్నందున తాము వెళ్లలేదని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో భంగపాటుకు గురైన ఎంపీ దివాకర్ రెడ్డి మిన్నకుండిపోవాల్సి వచ్చింది. గత నెల 15న విశాఖ ఎయిర్ పోర్ట్లో ఇండిగో విమాన సిబ్బందితో గొడవ పడిన ఆయనపై దేశీయ విమాన సంస్థలు నిషేధం విధించాయి. విమానయాన సంస్థలన్నీ ఆయన్ని తమ విమానాల్లోకి అనుమతించరాదని నిర్ణయించాయి. ఈ కారణంగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది.