అఫ్గానిస్థాన్‌లో దారుణం.. ఎనిమిది మంది క్రికెటర్ల మృతి..

SMTV Desk 2018-05-19 18:47:21  afghanistan bomb blast, kabul, cricket stadium, Jalalabad cricket match bomb

కాబుల్‌, మే 19 : అఫ్గానిస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ క్రికెట్ మైదానంలో బాంబులు పేలడం వల్ల 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. రంజాన్‌ మాసం కావడంతో నాన్‌గర్‌హార్‌ రాష్ట్ర రాజధాని‌లో ఓ క్రికెట్‌ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగానే గత రాత్రి మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అందరూ సంతోషంగా మ్యాచ్‌ వీక్షిస్తున్న సమయంలో ఆ ప్రాంగణమంతా ఒక్క సారిగా బాంబు పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు తెలుసుకునేలోపే దారుణం జరిగిపోయింది. ఇదే ప్రమాదంలో 45 మంది గాయపడ్డారని, వీరంతా ఆస్పత్రిలో చికత్సి పొందుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఖండించారు. మృతులకు సంతాపం తెలిపారు. అఫ్గాన్‌ అధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘని మాట్లాడుతూ..‘జలాలాబాద్‌ మైదానంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియరాలేదు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణం. దాడులకు పాల్పడిన వారు మానవత్వానికి శత్రువులు’ అని అన్నారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ఎటువంటి అధికారకప్రకటన చేయలేదు.