ప్రేమజంట ఆత్మహత్య

SMTV Desk 2017-07-09 12:55:02   ongol, Lovers supriya, dinesh,suicide

ఒంగోలు, జూలై 9 : ఒంగోలులో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మామిడిపాలెంలోని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు-1 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. అద్దంకికి చెందిన వేమా సుప్రియ(18), పల్లె దినేష్‌ (19)లు ఒకే కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు. అప్పటినుండి వారు ప్రేమించుకుంటున్నారు. సుప్రియను, తండ్రి రామస్వామి15 రోజుల క్రితం ఒంగోలులోని డిగ్రీ కళాశాల హాస్టల్లో చేర్పించి వచ్చారు. నిన్న శనివారం సెలవు కావడంతో దినేష్ సుప్రియ హాస్టల్ వద్దకు వెళ్లి సుప్రియను బయటికి పిలిచి మాట్లాడుతున్నాడు. దినేష్ ఫోన్‌ ద్వారా సుప్రియ స్థానిక హౌసింగ్ బోర్డులో నివాసం ఉండే తన బంధువు జానీని పిలిచి తనకి పరిచయం చేసింది. సుప్రియ కోరిక మేరకు ముగ్గురు కలిసి కళాశాల నుండి బయటికి మోటార్ సైకిల్ పై బయలుదేరారు. కొద్దిదూరం వెళ్ళాక మోటార్ సైకిల్ ఆపి దినేష్, సుప్రియలు నడుచుకుంటూ చెరువు కట్ట వైపు వెళ్లారు. వారినే అనుసరిస్తూ జానీ కూడా వెళ్ళాడు. దాదాపు మూడు గంటలపాటు వారిద్దరూ మాట్లాడుకుంటుండగా జానీ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కాసేపటి తర్వాత వారిద్దరి మద్య వాగ్వాదం పెరిగి సుప్రియ ఒక్కసారిగా చెరువులోకి దూకేసింది. ఆ వెంటనే దినేష్ కూడా దూకాడు. ఇది గమనించిన జానీ గట్టిగా కేకలు వేశాడు. కాని వారు అప్పటికే నీట మునిగారు. దీంతో జానీ బంధువులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ అధికారి సుబ్బారావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం, చెరువువద్దకు వెళ్లి గంటన్నర పాటు మృతదేహాలకోసం గాలించగా మొదట దినేష్ మృతదేహం, ఆ తర్వాత సుప్రియ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇరువురి బంధువులు వచ్చిన తర్వాత మృతదేహాలను గుర్తించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ రాంబాబు, తాలూకా ఇన్‌స్పెక్టర్‌ గంగావెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి సుప్రియ మేనమామ కుమారుడు శీలం జానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జానీ ప్రవర్తనపై తనకు అనుమానం ఉందని సుప్రియ తండ్రి రామస్వామి తెలిపారు. ఈ నేపధ్యంలో అసలు జానీని సుప్రియ ఎందుకు పిలిచింది అన్న కోణంలో విచారిస్తున్నారు. మూడు గంటలపాటు ఆ యువకుడితో సుప్రియ చనువుగా మాట్లాడడంతో పాటు వాగ్వాదం జరుగుతున్నప్పటికీ జానీ గుడ్లప్పగించి చూడడం పలు అనుమానాలకు దారితీస్తుంది.