ఢిల్లీ, మే 19 : ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూరమైన ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఢిల్లీకు ఉపయోగం లేదు. ఓడిన చెన్నై కు పోయేదేమీ లేదు. అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే లేదు...! ఇన్ని నిరాశల మధ్య మ్యాచ్ కూడా అలానే కొనసాగింది. ప్లేఆఫ్ సమీకరణాలతో సంబంధం లేని ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ జట్టు 34 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. తొలుత టాస్ నెగ్గిన చెన్నై సారథి ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టులో రిషిబ్ పంత్ (38), విజయ్ శంకర్ (36, నాటౌట్), హర్షల్ పటేల్ ( 36) రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో అంబటి తిరుపతి రాయుడు ( 50) మినహా మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో చెన్నై ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా (2/20), సందీప్ లమిచానే (1/21), 1/23 ప్రత్యర్థిని కట్టిపడేశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ కు దక్కింది.