జపాన్, మే 17 : భారతీయ రైల్వే సంస్థలో సాధారణంగా రైళ్లు సమయానికి రావు. అందుకు తగ్గట్టు మన దేశ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. గంటలు తరబడి రైళ్లు ఆలస్యంగా నడవడం మనకు కొత్తేం కాదు. అయితే జపాన్లోని ఓ రైల్వే సంస్థ మాత్రం రైలు చెప్పిన సమయం కంటే 25 సెకన్లు ముందు బయల్దేరి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సదరు సంస్థ చాలా సీరియస్గా తీసుకుంది. 25 సెకన్లు ముందుగా బయల్దేరి వెళ్లడం వల్ల ఓ ప్రయాణీకుడు రైలును మిస్సయ్యారని పేర్కొంది. వినియోగదారుడికి కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంస్థ ఉద్యోగి చేసిన పొరబాటుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించింది. గత శుక్రవారం ఉదయం జపాన్లోని నోటోగోవా స్టేషన్ నుంచి ఓ రైలు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఆ రైలు ఉదయం 7.12 గంటలకు వెళ్లాలి. అయితే ఫ్లాట్ఫాం వద్ద ప్రయాణికులెవరూ కన్పించకపోవడంతో టైం అయిపోయిందని భావించిన డ్రైవరు 7 గంటల 11 నిమిషాల 35 సెకన్లకు రైలును స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. రైలు తప్పిపోయిన ప్రయాణీకుడు స్టేషన్ ఇన్చార్జ్కు ఫిర్యాదు చేశారని వివరించింది. సిబ్బంది కాలపట్టికను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఈ పొరపాటు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. కాగా 25 సెకన్లు ముందుగా వెళ్లినందుకు తలెత్తిన అసౌకర్యానికి మన్నించాలంటూ సదరు రైల్వే సంస్థ ప్రకటన చేయడంతో ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. గతంలో జపాన్కు చెందిన ఓ రైల్వే సంస్థ కూడా ఇలానే రైలు 20 సెకన్లు ముందు బయల్దేరినందుకు క్షమాపణలు చెప్పింది.