హైదరాబాద్, మే 16 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అద్భుత చిత్రం "మహానటి". నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన నివాసంలో చిత్ర యూనిట్ మొత్తానికి డిన్నర్ పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా దర్శక నిర్మాతలను మంచు కుటుంబం తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. మోహన్ బాబు.. విష్ణు.. మంచు లక్ష్మి కలిసి దర్శక నిర్మాతలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సినిమాలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అదృష్టం దక్కినందుకు మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.