అమరావతి, మే 15 : కర్ణాటకలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నేటి ఉదయం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి స్పందిస్తూ.. బీజేపీ కర్ణాటకలో త్రిపుర తరహా రాజకీయాన్ని చేసిందంటూ దుయ్యబట్టారు. మొత్తం రూ.10,500 కోట్లు ఖర్చు చేసి అక్కడ అన్ని స్థానాలు గెలుపొందిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.