అమరావతి, మే 14 : ప్రధాని నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్లో దుష్ప్రచారం జరుగుతోందని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఏపీ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణా స్పష్టంచేశారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. విభజన చట్టంలోని హామీల్లో 85శాతం పూర్తి చేశామని కన్నా అన్నారు. మోదీపై వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే భాజపాపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. నూటికి నూరు శాతం విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన స్పష్టంచేశారు. పొత్తులో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి కాదనే పరిస్థితి మాత్రం లేదని ఆయన వెల్లడించారు.