ముంబై, మే 14 : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ సారథి రహానె పై రూ.12లక్షల జరిమానా పడింది. టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నెమ్మదిగా ఓవర్లు వేశారు. అనుకున్న సమయంలో వారు తమ ఇన్నింగ్స్ను పూర్తి చేయలేకపోయారు. దీంతో టోర్నీ నిర్వాహకులు ఆ జట్టు సారథి రహానెకు రూ.12లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. "ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇదే తొలిసారి. అందుకే ఆ జట్టు సారథి రహానెకు జరిమానా విధిస్తున్నాం" అని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఇది రెండోసారి. చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.