నిశ్చింతపుర్, మే 14 : కొత్త రైలు మార్గంతో అగర్తలా, కోల్కతాల మధ్య దూరం పది గంటలకు తగ్గిపోనుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా నూతన రైలు మార్గంతో ప్రయాణికులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య దూరం 1600 కి.మీ.గా ఉంది. గువాహటి మీదుగా ప్రయాణించి వెళ్తే దాదాపు 31 గంటలు పడుతుంది. అదే కొత్త మార్గంలో అయితే 550 కి.మీ. ప్రయాణిస్తే సరిపోతుంది. అంటే 21 గంటల సమయం ఆదా అవుతుంది. 2020 నాటికి ఈ మార్గం అందుబాటులోకి రానుంది. దీని కోసం ఆఖావురా నుంచి అగర్తలకు కేవలం 12.3 కి.మీ.ల కొత్త మార్గం ఏర్పాటుచేస్తే సరిపోతుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, పశ్చిమ బంగ్లాదేశ్ మధ్య నాలుగు మార్గాల్లో (పెట్రాపోల్-బెనాపోల్, గెదె-దర్శనా, రాధికాపుర్-బిర్లా, సింఘాబాద్-రోహన్పుర్) రైళ్లు నడుస్తున్నాయి. ఆఖావురా మార్గాన్ని ఢాకా-చిట్టగాంగ్తో అనుసంధానిస్తారు. దీంతో అగర్తలవాసులతోపాటు మిజోరం రాష్ట్ర ప్రజలకూ ఎంతో మేలు జరుగుతుందని ప్రాజెక్టు ఇంజినీర్ ఎంఎస్ చౌహాన్ వెల్లడించారు.