హైదరాబాద్, మే 13 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విశాఖ జిల్లా అనకాపల్లిలో బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న సాయి గణేశ్ ని పరామర్శించిన విషయం తెలిసిందే. సాయి గణేష్ అల్లు అర్జున్ను చూడటమే తన చివరి కోరికని తన వారితో అన్నాడు. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న బన్నీ అనకాపల్లి వెళ్లి అతడ్ని ఆప్యాయంగా పలకరించి, కాసేపు మాట్లాడారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గణేశ్ ఆదివారం కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బరువెక్కిన హృదయంతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. "సాయి గణేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆ వార్త విని గుండె పగిలింది. అతడి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా" అని ఆయన పేర్కొన్నారు. గణేశ్ను కలిసినప్పుడు దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.