ఢిల్లీ, మే 13 : విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఈ జోడి ఉంటే ఎంతా స్కోరైన అలవోకగా కొట్టేస్తారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ వీరిద్దరూ మరోసారి జూలు విదిల్చారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ వేగంగా అర్ధ శతకాలను నమోదు చేసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 70 (40 బంతుల్లో : 7 ఫోర్లు, 3 సిక్స్లు) పరుగులు సాధిస్తే.. ఏబీ 72(37 బంతుల్లో : 4 ఫోర్లు, 6 సిక్స్లు) పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. డివిలియర్స్ వల్లే తాము మ్యాచ్ గెలిచినట్లు వెల్లడించాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. "అతనితో కలిసి బ్యాటింగ్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతా. అతను క్రీజులో ఉంటే మరో ఎండ్లో ఉండే బ్యాట్స్మన్ పని మరింత సులువవుతుంది. ఈరోజు మేం మరో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాం" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.