హైదరాబాద్, మే 13 :కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కర్ణాటక ఫలితాలు దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని.. అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మతతత్వ విధానాలు అవలంభించిందని...సున్నితమైన అంశాలతో రాహుల్ గాంధీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని అరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భాజపా అధికారం చేపడుతుందని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తెదేపా మునుగుతున్న నావలాంటిదని.. అమిత్ షాపై దాడి జరగలేదని డీజీపీ స్పష్టం చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని.. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దత్తత్రేయ విమర్శించారు.