ముంబై మారణహోమనికి కారణం పాకిస్థానే : షరీఫ్‌

SMTV Desk 2018-05-12 20:37:20  Nawaz Sharif, 26/11 Mumbai terror attacks, pakistan former president, don news paper

లాహోర్, మే 13 ‌: ముంబైలో (26/11) మారణహోమం భారత ప్రజలు ఎప్పటికి మరిచిపోలేరు. ఈ దుశ్చర్యకు ఉగ్రవాదుల్ని పురమాయించింది పాకిస్థానేనని పదవీచ్యుత ప్రధాని నవాజ్‌షరీఫ్‌ అంగీకరించారు. ప్రభుత్వేతర శక్తులు సరిహద్దు దాటి వెళ్లి ముంబైలో మారణహోమం సృష్టించేందుకు అవకాశం కల్పించిన పాక్‌ విధానాలను ఆయన ప్రశ్నించారు. పాక్‌లో ఉగ్రమూకలు క్రియాశీలంగా ఉన్నాయని తొలిసారిగా, బాహాటంగా ఆయన అంగీకరించారు. ప్రముఖ దినపత్రిక ‘డాన్‌’కు ఇచ్చిన ముఖాముఖిలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "మనల్ని మనం ఏకాకుల్ని చేసుకున్నాం. త్యాగాలు చేసినా మన వాదనకు ఆమోదం లభించలేదు. అఫ్గాన్‌ వాదనకు అంగీకారం లభించినా, మనది మాత్రం నెగ్గలేదు. తప్పనిసరిగా దీనిని పరిశీలించాలి. సరిహద్దులు దాటడానికి ప్రభుత్వేతర శక్తుల్ని (ఉగ్రవాదుల్ని) అనుమతించి, ముంబయిలో 150కి పైగా ప్రాణాలు ఎందుకు తీయాల్సి వచ్చిందో నాకు వివరించండి. విచారణను మనమెందుకు పూర్తి చేయడం లేదు? " అని షరీఫ్‌ ప్రశ్నించారు.