బెంగళూరు, మే 11: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ, ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సరిచేశారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5గంటల వరకూ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. 6గంటల వరకు దాదాపు 70శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. జయనగర భాజపా అభ్యర్థి విజయకుమార్ హఠాన్మరణంతో ఆ ఎన్నిక రద్దవ్వగా.. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు మే 15న జరగనుంది.