కోల్కతా, మే 12 : కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మట్టుబెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. గతంలోనూ తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని మమతా వ్యాఖ్యానించారు. "నన్ను చంపేందుకు ఓ రాజకీయ పార్టీ సుపారీ ఇచ్చింది..వారు నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. వేరే ఇంటిలోకి మారాలని పోలీసులు నాకు సూచించారు" అని మమత చెప్పారు. తాను విశ్వసనీయ సమాచారమే వెల్లడిస్తున్నానని, సదరు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తక్షణమే తనను ప్రభుత్వ బంగళాలోకి మారాలని కోరారన్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ప్రధాన సమస్యలను గాలికోదేలేసి తనను విమర్శించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా 12,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని.. వీటిపై కాంగ్రెస్, సీపీఎంలు కనీసం నిరసన కూడా తెలపడం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్లకు దీటుగా ప్రాంతీయ పార్టీలు సైతం బలీయమైన శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా ఉంటాయని అంచనా వేశారు. బీజేపీ దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోందని, సీపీఎం, కాంగ్రెస్ సైతం హింసను ప్రేరేపిస్తున్నాయని తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు.