బెంగళూరు, మే 12 : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలైంది. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వాడుకున్నారు. బెంగళూరులో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిల్చున్న ఫొటోను కుంబ్లే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. మరో వైపు క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కన్నడ నటులు రమేశ్ అరవింద్, రవిచంద్ర, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఓటు వేశారు. ఇటీవల కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లను పార్టీలో చేర్చుకునేందుకు భాజపా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన.. అందుకు వారు నిరాకరించారు. రాష్ట్రంలో మొత్తం 222 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 15 న వెలువడనున్నాయి.