బెంగళూరు, మే 12: దేశం యావత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. జయనగర భాజపా అభ్యర్థి విజయకుమార్ హఠాన్మరణంతో ఆ ఎన్నిక రద్దవ్వగా.. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత క్యూ ఉందో తెలుసుకునే మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఓట్ల లెక్కింపు 15వ తేదీని నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.